భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తాం
కోలారు: నగరంలో వీరశైవ లింగాయత సముదాయ భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ హామీ ఇచ్చారు. ఆదివారం నగరంలోని టి.చన్నయ్య రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సంస్కృతిశాఖ ఆధ్వర్యంలో జగద్గురు రేణుకాచార్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేణుకాచార్య తత్వ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. ఆయన మార్గదర్శనంలో ముందుకెళ్లాలని సూచించారు. నాగలాపురం సంస్థానమఠం తేజేశ లింగ శివాచార్య మహా స్వామి మాట్లాడుతూ.. మానవుడిని మహదేవుడిగా చేసిన గొప్పవాడు జగద్గురు రేణుకాచార్య అని కొనియాడారు. కార్యక్రమంలో బెళ్లావి సంస్థాన మఠం మహంతేశ శివాచార్య స్వామి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, సముదాయ ప్రముఖులు వీరభద్రస్వామి, కన్నడ, సంస్కృతిశాఖ డైరెక్టర్ ఎన్.విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


