డ్యాం గేట్ల పనులు త్వరగా పూర్తి చేయండి
సాక్షి,బళ్లారి/హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే ప్రధాన ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్గేట్లు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత నారా సూర్యనారాయణ రెడ్డి, కర్ణాటక హసిరు సేనె, రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు రఘునాథ్, అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే మంగళవారం టీబీ డ్యాంను సందర్శించి క్రస్ట్గేట్ల పనులను పరిశీలించారు. డ్యాంకు ఉన్న 33 గేట్లలో గత ఏడాది నవంబర్లో 19వ నంబరు క్రస్ట్గేట్ కొట్టుకు పోయిన నేపథ్యంలో అన్ని గేట్లు మార్చాలని నిపుణులు సూచించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో రబీ పంటకు క్రాప్ హాలిడేని ప్రకటించి కొత్త క్రస్ట్గేట్లను అమర్చే పనులు చేస్తున్నందున వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేలోపు గేట్లన్ని మార్చి కొత్త వాటిని అమర్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పనుల ప్రగతిపై పరిశీలన
తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఆర్.రామకృష్ణారెడ్డితో మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నేతలు క్రస్ట్గేట్ల అమరిక పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. త్వరితగతిన అన్ని క్రస్ట్గేట్లన్ని అమర్చాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలన్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్లో సకాలంలో నీరందించేందుకు పనులు వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ సాంకేతికంగా క్రస్ట్గేట్లను అమర్చే ప్రక్రియ చేపట్టామన్నారు. మే నెల లోపు గేట్లన్ని అమర్చడానికి కృషి చేస్తామన్నారు. డ్యాంను సందర్శించిన ప్రతినిధి బృందంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చామరస మాలిపాటిల్, కళ్యాణ కర్ణాటక డివిజనల్ కార్యదర్శి ఎం.ఎల్.కే.నాయుడు, తాలూకా అధ్యక్షుడు గంటా సోమశేఖర్, బాగల్కోట జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, డీఎం నదాఫ్ తదితరులు పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
డ్యాంను సందర్శించిన రైతు నాయకులు
డ్యాం గేట్ల పనులు త్వరగా పూర్తి చేయండి


