లింగారెడ్డి సేవలు మరువలేనివి
సాక్షి,బళ్లారి: కంప్లి షుగర్ ఫ్యాక్టరీ స్థాపనలో, బళ్లారి నగరంలో దారంమిల్, జనతా బజార్ స్థాపన తదితర ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే హెచ్ లింగారెడ్డి సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం నగరంలోని రాఘవ కళా మందిరంలో హెచ్.లింగారెడ్డి 50వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు రాంప్రకాష్ రెడ్డి, రవిప్రకాశ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్.లింగారెడ్డి నిస్వార్థ ప్రజాసేవ చేశారని, రాఘవ కళా మందిరం అభివృద్ధికి సహకరించారని, న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా కూడా సేవలందించారని కొనియాడారు. కంప్లి షుగర్ ఫ్యాక్టరీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన సొంత నిధులను ఖర్చు చేసి కార్మికులను, కర్మాగారాన్ని ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ మహానుభావుడి సేవలను, తమ జ్ఞాపకాలను ఎన్నటికీ మరిచి పోలేమని అన్నారు. అరుదైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. కార్యక్రమంలో రాఘవ కళా మందిరం గౌరవ అధ్యక్షుడు చెన్నప్ప, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, భీమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


