
దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ర్యాలీ
హుబ్లీ: పుణ్యక్షేత్రం ధర్మస్థలపై దుష్ప్రచారం జరుగుతున్న తీరును వ్యతిరేకిస్తూ ధార్వాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. కడప మైదానం నుంచి డీసీ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొని జిల్లాధికారి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. దుష్ప్రచారం వెనుక వామపక్షాల కుట్ర ఉంది. దుష్ప్రచార బాధ్యులను అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిట్ దర్యాప్తు నివేదికను తక్షణమే వెల్లడించాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సీమ మసూతి, తిప్పన్న మజ్జిగి, వీరేష్ అంచటగేరి, రాజన్న కొరవి, శంకర, శ్రీనివాస, మంజునాథ, ఈశ్వర గాణిగెర్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా మైదానంలో
చవితి వేడుకలకు శ్రీకారం
హుబ్లీ: చెన్నమ్మ సర్కిల్ ఈద్గా మైదానంలో గజానన ఉత్సవ మహా మండలి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే వినాయక ఉత్సవాల వేడుకల నేపథ్యంలో మంగళవారం శాస్త్రోక్తంగా పందిరికి ఆలకంబ పూజ నెరవేర్చారు. పోలీసులు నాలుగు రోజుల పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మండలి అధ్యక్షుడు సంజయ్ బడస్కర్, ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి, డిప్యూటీ మేయర్ సంతోష్ చవాన్, స్వాగతి సమితి అధ్యక్షుడు డాక్టర్ వీఎస్వీ ప్రసాద్, నారాయణ, ఉమేష్, లింగరాజ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
డేగ కళ్లతో పటిష్ట నిఘా
●ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
హొసపేటె: గణేష్ పండుగ సందర్భంగా నగరంలో ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి పరిశీలించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగరంలోని అంబేడ్కర్ సర్కిల్, గాంధీ చౌక్, పుణ్యమూర్తి సర్కిల్, వాల్మీకి సర్కిల్, రైల్వే స్టేషన్ రహదారి, చిత్తవాడిగి, బళ్లారి సర్కిల్, బస్టాండ్ రోడ్డు, పెద్ద మసీదు రోడ్డు, మెయిన్ బజార్ తదితర చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయుడైన జిల్లాధికారి
●విద్యార్థులకు సైన్స్ పాఠం బోధించిన వైనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటెలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ నగర్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలను విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ సందర్శించి విద్యార్థులకు సైన్స్ పాఠం చెప్పారు. వివిధ విషయాల గురించి విద్యార్థులకు బోధించడం ఇదే మొదటిసారి. విద్యార్థులకు బోధించడంతో పాటు, విద్యాబోధన నాణ్యతను తనిఖీ చేయడానికి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, సేఫ్ రూమ్ మొదలైన వాటిని తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, ఆహార పదార్థాల నాణ్యత, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు పాఠాలపై ఎక్కువ శ్రద్ధ చూపి కఠోర సాధన చేయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరాలన్నారు.
పెచ్చులూడిన బస్టాండ్ పైకప్పు
●నామమాత్రంగా మరమ్మతులు
రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. మరమ్మతు విషయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నారు. ఆరు రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో అకస్మాత్తుగా పెచ్చులూడాయి. ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో పెచ్చులూడడంతో పిల్లలతో పాటు పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు వారం రోజుల తరువాత మరమ్మతు పనులు చేపట్టారు. కేవలం పెచ్చులూడిన చోట సిమెంట్ కాంక్రీట్ వేయకుండా తెల్లని సున్నం పూసి చేతులు దులుపుకుంటున్నారు. నాసిరకంగా పనులు చేస్తుండడంపై అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ప్రజలు ఖండించారు.

దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ర్యాలీ

దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ర్యాలీ

దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ర్యాలీ