
వెలుగు చూసిన పాలెగార్ల శాసనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దు గ్రామమైన నుంకనహళ్లిలో గూడేకోటే చివరి గవర్నర్ ఇమ్మడి బొమ్మల నాయక, ముమ్మడి బొమ్మల నాయకకు సంబంధించిన శాసనం వెలుగు చూసినట్లు చరిత్ర అధ్యాపకుడు హెచ్ఎం.తిప్పేష్ తెలిపారు. నుంకనహళ్లి లోయలో తూర్పు ముఖంగా ఉన్న ఒక రాతిపై 15 పంక్తులలో ఇమ్మడి బొమ్మల, గుడేకోటే చివరి గవర్నర్ అని రాసి ఉందని పేర్కొన్నారు. 1833లో భట్టార్ సత్యప్ప కుమారుడు మచ్చగిరికి చేసిన భూ దానం ఇందులో పేర్కొనబడిందన్నారు. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే తల్లిని ధిక్కరించినట్లే, బ్రాహ్మణుడిని ధిక్కరిస్తే ఆవును చంపినట్లే శిక్షించబడతావు అని శాసనంలో ఉందన్నారు. అదేవిధంగా శాసనంలో గాడిద చిత్రం ఉందని, ఇది ఒక శాపానికి సంబంధించిన చిహ్నమన్నారు. మొళకాల్మూర్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల చరిత్ర ప్రొఫెసర్ యోగానంద, మిథిక్ సొసైటీ శాసన నిపుణుడు శశికుమార్ నాయక్, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ షెజేశ్వర్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ ఆర్.మంజన. చరిత్ర విద్యార్థులు, స్థానికుల సహకారంతో ఈ శాసనాన్ని గుర్తించినట్లు తెలిపారు.