కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ప్రారంభించింది. విశేష స్పందన లభించడంతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో కరీంనగర్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సిద్ధం చేసారు. ఇక్కడి నుంచి కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజక వర్గ పరిధిలోని 17 మండలాల్లో ఉన్న 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తారు. మెనూలో ప్రతిరోజు ఒక వైరెటీ ఉంటుంది. సోమవారం ఇడ్లీ– సాంబార్, మంగళవారం: పూరి– ఆలు కుర్మా, బుధవారం దోష– చెట్నీ, గురువారం ఉప్మా– చెట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ– సాంబార్, శనివారం బోండా– చట్నీ అందించనున్నారు. విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు అందిస్తారు. ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నారు.


