కరీంనగర్ కార్పొరేషన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణకు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద గందరగోళం కొనసాగుతోంది. ప్రతిరోజు దాదాపు మూడు వేలకు పైగా నోటీసులు అందుకున్న ఓటర్లు, వారి సంబంధీకులు వస్తుండడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. అందుకు తగినట్లుగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం ఘర్షణలకు తావిస్తోంది. నగరపాలకసంస్థ పరిధిలో ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణకు సంబంధించి కళాభారతిలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ముకరాంపుర, షాషామహాల్ తదితర ప్రాంతాలకు సంబంధించి విచారణ సాగింది. కౌంటర్లు 20 వరకు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. అక్కడికి వచ్చిన వాళ్ల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకొంటున్నాయి. శుక్రవారం 200 పోలింగ్ బూత్ పరిధిలో విచారణకు హాజరైన ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తన పక్కనున్న వారిని దుర్బాషలాడుతూ, బిగ్గరగా అరుస్తూ, బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, అతడిని అక్కడి నుంచి తరలించారు. కొద్దిసేపటి తరువాత మరోసారి అక్కడకు వచ్చిన సదరు వ్యక్తి మళ్లీ దూషణలకు దిగాడు. కాగా సెప్టెంబర్ 22వ తేదీ వరకు ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగనుండడం, ప్రతి రోజు మూడు నుంచి ఐదువేలకు పైగా జనాలు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా బందోబస్తు, ఇతరత్రా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది.


