● మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు
తిమ్మాపూర్(మానకొండూర్): యువతను ఉపాధి వైపు మళ్లించాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. స్వావలంబన, స్వపరిపాలన దిశగా రాష్ట్రం అడుగులు వేయాలని సూచించారు. ఆదివారం మహాత్మానగర్ పంచాయతీ పరిధి శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్– 2026 శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత దేశానికి బలమని, యువశక్తిని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తామని సీఎం చెప్పినా, ఆ మాటలు కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. ప్రతీ మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే యువత చెడుమార్గాలకు దూరంగా ఉంటారని, సృజనాత్మక రంగాల వైపు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అ వకాశాలు సృష్టించాలని సూచించారు. రాయికల్లో జీఎంఆర్ సహకారంతో ఎలక్ట్రీషియన్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని ఉదాహరణగా చెప్పి, ఇలాంటి మోడల్స్ను మ రిన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని కోరారు.
తెలుగుభాషను కాపాడుకోవాలి
తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్రావు పేర్కొన్నారు. యునెస్కో ఆదేశాల మేరకు ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. పంప కవి తెలుగు సాహిత్యానికి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కలిసి హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఆవిష్కరించాలని సూచించారు. ఇది తెలుగుభాష గౌరవానికి గొప్ప నిదర్శనమవుతుందని అభిప్రాయపడ్డారు.
నగరపాలక సంస్థ ఈఈ, డీఈ బదిలీ
కరీంనగర్కార్పొరేషన్: నగరపాలక సంస్థ ఈఈ, డీఈ బదిలీ అయ్యారు. ఈఈ సంజయ్కుమార్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు, డీఈ అరుణకుమార్ కోరుట్ల మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఎవరిని నియమించలేదు.


