వీణవంక: ఇసుక లారీలు వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీణవంక మండలంలో రోడ్డుపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వీణవంక మండలంలోని కోర్కల్, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఉన్న మానేరు వాగులో క్వారీలు ఏర్పాటు చేయగా లక్షల టన్నుల ఇసుక సరిహద్దు దాటుతోంది. ఆయా గ్రామాల పరిధిలో దారిపొడవునా ఇసుక కోసం పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తీరుమార్చుకోవాలని అప్పటి కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం ఇసుక క్వారీ కాంట్రాక్టర్లను హెచ్చరించినా మార్పు రావడం లేదు. క్వారీ యజమానుల తీరుపై మామిడాలపల్లి గ్రామస్తులు పదుల సార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. పోతిరెడ్డిపల్లి శివారులోని ఇసుక క్వారీ వద్ద మూడు రోజులుగా రెండు కిలోమీటర్ల మేర సుమారు 400కు పైగా లారీలు రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పోతిరెడ్డిపల్లి, వీణవంక, రెడ్డిపల్లి,, కొండపాక, మామిడాలపల్లి, చల్లూరు, కోర్కల్, హిమ్మత్నగర్ వాసులకు ఇసుక లారీలతో నరకం కనిపిస్తోంది. శంకరపట్నం మండలం మీదుగా వచ్చే లారీలతో ఇప్పటికే రోడ్లు ధ్వంసమయ్యాయి. వాగులో ఇసుక తోడడంతో తాగు,సాగు నీటికి ఇబ్బందిగా మారుతోందని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ వాపోయాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని లారీలను రోడ్లపైన పార్కింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


