కరీంనగర్ అర్బన్/కరీంనగర్టౌన్: ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడంపై నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యాచరణ గురించి స్పష్టంగా తెలపాలని, ఈ కార్యక్రమంలోని 10 అంశాలు వాటి ప్రాధాన్యతను వివరించాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ డీడీ నాగలేశ్వర్, డి వైఎస్ఓ శ్రీనివాస్, హౌసింగ్శాఖ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేగవంతంగా పంచాయతీ భవనాల నిర్మాణం
గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై డీఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన గ్రామపంచాయతీ, అంగన్వాడీ, పాఠశాల, ఇతర భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని అన్నారు. ఇంకా ప్రారంభంకాని పనులపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. స్థలం కొరత ఉన్న గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. మండల స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి, ఏఈ, డీఈ, ఎంపీడీవోలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీవో శ్రీధర్, పంచాయతీరాజ్ ఈఈ రహమాన్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం ఆకస్మిక తనిఖీ
కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


