పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి | - | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి

May 6 2024 7:15 AM | Updated on Apr 29 2025 1:43 PM

వాంతులు చేసుకున్న కోరుట్లవాసి

వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ

ఫర్నిచర్‌ ధ్వంసం

కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్‌ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్‌ రెహ్మాన్‌(48) ఆటోడ్రైవర్‌. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్‌ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్‌ రెహ్మాన్‌ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్‌, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు.

న్యాయం జరిగేలా చూస్తామని హామీ..

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్‌ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్‌, నవీన్‌ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్‌ రెహ్మాన్‌ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

వాంతులు చేసుకున్న కోరుట్లవాసి

వైద్యులు చికిత్స అందించలేదని

కుటుంబసభ్యుల ఆరోపణ

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు,

సిబ్బందితో గొడవ

ఫర్నిచర్‌ ధ్వంసం

Advertisement
 
Advertisement
Advertisement