బిచ్కుంద(జుక్కల్): విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తే అది వారి భవిష్యత్తుకు మరింత బలాన్నిస్తోందని నమ్ముతాడు మద్నూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల ఉపాధ్యాయుడు రచ్చ శివకాంత్. బిచ్కుంద పట్టణానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు పదో తరగతి ఫలితాల్లో బిచ్కుంద, మద్నూర్ మండలాల టాపర్లతోపాటు హైస్కూల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు పదేళ్లుగా నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. విద్యార్థుల విజయమే ఉపాధ్యాయుని సంతృప్తి అనే భావనతో ప్రతి సంవత్సరం సుమారు 13 మందికి రూ.20 వేలకుపైగా సొంత డబ్బులతో ప్రతిభాపురస్కారాలు అందజేస్తున్నారు. తాను అందిస్తున్న పురస్కారంతో ఇతర విద్యార్థులు సైతం చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు రచ్చ శివకాంత్.


