ప్రతిపాదనలు పంపించాం
● శిథిలావస్థకు చేరిన
బాన్సువాడ బస్టాండ్
● ప్రయాణికులతో కిక్కిరిసి
పోతున్న ప్లాట్ఫారాలు
బాన్సువాడ రూరల్: గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అనంతరం డివిజన్ కేంద్రంగా రూపాంతరం చెందినా, బాన్సువాడలో బస్టాండ్ మాత్రం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విస్తరించబడలేదు. దీంతో ప్లాట్ఫారాలు సరిపోవడం లేదు. నిత్యం ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసి ఉంటోంది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నాలుగు దశాబ్దాల క్రితం నిర్మాణం..
ప్రస్తుతం బాన్సువాడలో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని 1988 మే 5న అప్పటి ఎమ్మెల్యే ఎస్.వీ.యల్ నరసింహరావు ప్రారంభించారు. తర్వాత ప్లాట్ఫారాలు విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. భవనం పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. పైపెచ్చులు ఊడిపడిన పలుచోట్ల అధికారులు మరమ్మతులు చేయించినా, మరోచోట పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. టాయిలెట్లు సరిపడా లేవు. నిర్వాహణ లోపంతో దుర్వాసన వెదజల్లుతోంది. తాగునీరు సౌకర్యం అంతంతే ఉంది. వర్షం పడితే బస్టాండ్ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన బస్టాండ్ నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బాన్సువాడ బస్టాండ్ శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. పై పెచ్చులు ఊడుతుంటే మరమ్మతులు చేయిస్తున్నాం. సమస్యను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
–రవికుమార్, డిపో మేనేజర్, బాన్సువాడ


