కామారెడ్డి క్రైం: నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ముగ్గురిని దేవునిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ మధుసూదన్ కేసు వివరాలను వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ సర్వే నం 210/1లో గంభీరావుపేటకు చెందిన ముక్తావరం వెంకటయ్యకు 200 గజాల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెంకటయ్య దేవునిపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. కేసులో ప్రధాన నిందితుడు రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తనకున్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలంపై కన్నేశాడు. స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని విక్రయించేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా, విక్రయదారుగా యజమాని వెంకటయ్య స్థానంలో తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామ గుండ్రెడ్డి సంగారెడ్డిని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరుపరిచాడు.
నకిలీ గుర్తింపు పత్రాలు, ఆధారాలతో అక్రమంగా ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో తేలింది. అసలు విషయాన్ని దాచిపెట్టి అనంతరం అదే ప్లాటును ఇతరులకు విక్రయించగా ఇప్పటివరకు ఆ స్థలం పలువురి పేర్లపై వరుసగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డిని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అతనితో పాటు అతని భార్య, మామ లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. భూములు, స్థలాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ లను అభినందించారు.
ముగ్గురి నిందితుల అరెస్ట్


