కామారెడ్డి క్రైం: జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్లో శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ జనగణన సంచాలకుల కార్యాలయం నుంచి సంయుక్త సంచాలకులు డి.వి రమణ, రాజేశ్వర్, సిబ్బంది జిల్లాకు విచ్చేశారు. ముందుగా వారు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీలో కచ్చితత్వం, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా సమాచార సేకరణ, డేటా నమోదు ప్రక్రియలను నిర్వహించాలన్నారు. శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి ఆగస్టు 4 వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన అధికారులు, సీపీవో రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహించొద్దని గ్రామసభలో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ జ్యోతి సంతోష్గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో గ్రామంలో బెల్ట్షాపులతో కలిగే ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్ట్షాపులను నిర్వహించొద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉపసర్పంచ్ బైండ్ల ధశరథం,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దోమకొండ: స్థానిక ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ‘మొక్క లు నాటుదాం..మనవి చేద్దాం’ అనే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్య విధాన పరిషత్కు రెగ్యులర్ కమిషనర్ను నియమించకపోవడంతో ఆయా వైద్య శాలల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడింది. ఈ విషయమై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతో వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ‘మొక్కలు నాటుదాం..మనవి చేద్దాం’ అనే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వై ద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్ట ర్ వెంకటేశ్వర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


