అందుబాటులోకి రానున్న కోర్సులు
సద్వినియోగం చేసుకోవాలి
● ‘పీఎం సేతు’కు ఎంపిక
● అత్యాధునిక హంగులు, ప్రపంచస్థాయి
ప్రమాణాలతో త్వరలోనే అప్గ్రేడ్
ఎల్లారెడ్డి: దేశంలో వృత్తిపరమైన శిక్షణలో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటి ట్రాన్సఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం–సేతు) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి సంగారెడ్డి క్లస్టర్ పరిధిలో ఎల్లారెడ్డి ఏటీసీని ఎంపిక చేశారు. దీనిద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు, డిజిటల్ ల్యాబ్లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
అభివృద్ధికి రూ.40 కోట్లు..
ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వేయి ఏటీసీలను ఆధునికీకరించనుంది. సంగారెడ్డి ఏటీసీ క్లస్టర్ కింద ఎల్లారెడ్డితోపాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏటీసీలున్నాయి. వీటిని స్పోక్ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ లాండ్ ఫౌండేషన్ సహకారంతో ప్రతి స్పోక్ సెంటర్కు రూ. 40 కోట్లు, హబ్గా ఉండే సంగారెడ్డికి రూ.80 కోట్లు ఇవ్వనున్నారు. మొత్తంగా రూ. 240 కోట్లను వెచ్చించి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
పీఎం సేతు కింద ఎంపికై న ఏటీసీలలో పలు కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిజం, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషీనింగ్ టెక్నిషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ అటోమేషన్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ (మెకానికల్), ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ కోర్సులు రానున్నాయి.
ఎల్లారెడ్డి ఏటీసీ కేంద్రం స్పోక్ ఏటీసీగా త్వరలో అప్గ్రేడ్ కాబోతోంది. దీనిలో ప్రపంచ స్థాయి ప్రమాణా లతో అత్యాధునిక యంత్రాలు, డిజిటల్ క్లాస్రూంలు తదితర మౌలిక సదుపాయాలతో మాస్టర్ ట్రైనర్ల ద్వారా అత్యుత్తమ శిక్షణ ఇస్తాం. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రూపానాయక్, ప్రిన్సిపాల్, ఏటీసీ, ఎల్లారెడ్డి
విద్యార్థులు ఈ కోర్సులలో చేరేందుకు ఎటువంటి ఫీజు ఉండదు. శిక్షణ కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్షిప్ ఇస్తుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 100శాతం ప్లేస్మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తిగలవారు టీజీ ఐటీఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏటీసీ ద్వారా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


