ఎల్లారెడ్డిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ ఆదివారం తెలిపారు. 2వ వార్డులో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో మహిళ సమాఖ్య భవనానికి రూ.10లక్షల నిధులు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఉప సర్పంచ్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో ముందుండాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులు ముందుండాలని ఎంపీవో మలహరి సూచించారు. ఆదివారం లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండో రోజు వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లోని తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వార్డు సభ్యులపై ఉంటుందన్నారు. అలాగే వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, పారిశుద్ధ్యం, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ రాజ్ చట్టం–2018లోని అంశాలు, అమలు విధానాన్ని వివరించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.


