● విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు
నిజామాబాద్ రూరల్: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈఆర్టీ(ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. సబ్డివిజన్ స్థాయిలో 14 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్ఈ వివరించారు. ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్ఈ అన్నారు.


