కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం
● బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో కార్నర్ మీటింగ్లకు భారీగా హాజరైన జనం
● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు
ఎల్లారెడ్డిలో కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలు
నిజాంసాగర్(జుక్కల్)/ఎల్లారెడ్డి/బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్నర్ మీటింగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయా పట్టణాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా బిచ్కుందలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకుల ఉత్సాహం చూసి, ఎన్నికల ప్రచారంలాగా లేదని ఎన్నికల విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. జుక్కల్కు శాశ్వత ఎమ్మెల్యే ఎవరంటే హన్మంత్ సింధేనని అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 స్థానాలను గెలిపిస్తే, కౌన్సిల్లో తీర్మానం చేయించి గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామన్నారు. అలాగే ఎల్లారెడ్డిలో కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గాంధీచౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్టాండ్ నిర్మాణానికి రూ.5కోట్లు, 300 డబుల్ బెడ్ రూంలకు 18 కోట్ల రూపాయలు, 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకల ఆస్పత్రికి రూ.10 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు, రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోటి రూపాయలతో వైకుంఠ ధామం, , మినీ ట్యాంక్ బండ్, డయాలసిస్ సెంటర్ తదితర వాటికి నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనికి సంబందించిన జీవోలను సైతం ప్రజలకు చూయించడం జరిగిందన్నారు. పనులు పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని ప్రారంభోత్సవాలు చేసి ఆర్భాటాలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదని అన్నారు. అంతకుముందు బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గజమాలతో కేటీఆర్ను ఘనంగా సత్కరించారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గంకు ఇవ్వని నిధులు బాన్సువాడకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ అంటూ, బాన్సువాడలో మాత్రం కాంగ్రెస్ అంటు ప్రచారం చేస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డి కండువ కప్పుకునే ప్రచారం చేయాలని అన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తానాజీరావు, బీఆర్ఎస్ నాయకులు నాల్చర్ రాజు, గిర్ధావర్ గంగారెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, మోచీ గణేష్, రమేష్యాదవ్, బాడి శ్రీనివాస్, అక్బర్, శివ, ఖలీల్, ధర్మతేజ ఉన్నారు.
కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం
కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం
కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం


