కారులో హుషారు!
వచ్చే ఎన్నికల్లో గెలుపును ఆపలేరు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. మూడు మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రచార సభలకు ప్రజలు భారీగా తరలిరావడంతో గులాబీ దండులో నూతనోత్సాహం కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/బాన్సువాడ/నిజాంసాగర్/ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడా రు. రేవంత్రెడ్డి బూతులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అప్పట్లో ఇదే గడ్డమీద రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డిని, ఆయన కొడుకులను దున్నపోతులు, ఆంబోతులు అని సంబోధించిన ఆడియోను వినిపించారు. పోచారం పార్టీ మారడంతో దొంగ చాటుగా ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్రెడ్డి విసిరిన ఎంగిలి మెతుకులకు ఆశపడి విలువను దిగజార్చుకున్నాడంటూ పోచారం గురించి పరుషంగా మాట్లాడారు. ఆయనకు రోషం, దమ్ము ఉంటే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి తన సత్తా చాటాలని సవాల్ చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను, బాన్సువాడ ప్రజలను మోసం చేసిన పోచారం శ్రీనివాస్రెడ్డికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
ఎల్లారెడ్డి సభలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వైఫల్యాలను ఎత్తిచూపారు. ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాసిచ్చిన బాండ్ పేపర్ ఏమయ్యిందని కేటీఆర్ ప్రశ్నించారు. వరదలొస్తే ప్రపంచబ్యాంకు సాయం అడిగి మన దేశం ఇజ్జత్ తీసిన గొప్పోడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబంపైకి ట్రాక్టర్ను తీసుకువెళ్లి ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మదన్మోహన్రావు బిందెలు పంచి, బిందె కింద కమ్మేసిండని ఇప్పటికైనా వారి మోసపూరిత హామీలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్లో రైతుబంధు పడేదని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా పెట్టుబడి సాయం రాలేదన్న విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయని, మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని పేర్కొన్నారు.
బిచ్కుంద సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులకు నిధులు మంజూరు చేశామని, పనులు ఎందుకు పూర్తి చేయడంలేదో ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. రూ.5 వందల కోట్లతో నాగమడుగు పనులు చేపడితే, ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకువెళ్లడంలేదో అడగాలన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్కు, లేకపోతే కారుకు ఓటేయాలని ప్రజలను కోరారు.
ర్యాలీలు, సభలు..
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కేటీఆర్ ముందుగా బాన్సువాడకు చేరుకున్నారు. పట్టణ శివార్లలోని కొయ్య గుట్ట అమరవీరుల స్తూపం వద్ద నుంచి ర్యాలీ గా పట్టణంలోకి వచ్చారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద సభలో మాట్లాడారు. అనంతరం బిచ్కుందలో రోడ్షో నిర్వహించారు. ఎన్నికల ప్రచార సభలో భారీగా జనం పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోనూ భారీ ర్యాలీ తీశారు. గాంధీ చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, నాయకులు జుబేర్, తానాజీరావ్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవడం పక్కా అని, జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధే గెలుపును ఎవరూ ఆపలేరని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మూడు మున్సిపాలిటీల్లో
కేటీఆర్ ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం చెప్పాలని పిలుపు
భారీగా తరలివచ్చిన ప్రజలు..
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
కారులో హుషారు!


