
తాగి నడిపితే జైలుకు!
వాహనదారుల్లో వణుకు..
విస్త ృతంగా తనిఖీలు..
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
● 25 రోజుల్లో 1,014
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● 13 మందికి రెండు రోజులు,
18 మందికి ఒక రోజు
జైలు శిక్ష
● 281 మందికి జరిమానాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాలను ని యంత్రించేందుకు పోలీసు శాఖ బహుముఖ వ్యూ హం అమలు చేస్తోంది. ప్రమాదాలకు కారణాలను గుర్తించి చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా చాలా ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. డ్రంక్ అండ్ డ్రైవ్పై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరో కోణమైన యాక్సిడెంట్ స్పాట్లను గు ర్తించి వాటిని ఆయా శాఖల అధికారులతో కలిసి సరి చేయిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా వా హనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నా రు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా ఒత్తిడి తెస్తున్నారు. హెల్మెట్ ధరించనివారికి జరిమానాలు విధిస్తు న్నారు. ఇటీవల జిల్లాలో ఒకేరోజు డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి 91 మందిని అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన వారిని రిమాండుకు పంపుతున్నారు. వారికి జరిమానాలు లేదంటే ఒకటి, రెండు రోజుల జైలు శిక్ష పడుతున్నాయి.
కఠినంగా వ్యవహరిస్తూ..
మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఈ కేసుల్లో జరిమానాలు, ఒకరోజు, రెండు రోజుల జైలు శిక్షలు విధిస్తున్నారు. ఒక్క ఆగస్టులోనే అంటే 25 రోజుల్లో జిల్లాలో 1,014 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 281 మందికి కోర్టు రూ. 1,200 చొప్పున జరిమానాలు విధించింది. 13 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 18 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించడంతో వారు చిప్పకూడు తినాల్సి వచ్చింది. మిగిలిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఒక వ్యక్తికి ప్లకార్డు చేతికిచ్చి రోజంతా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఎవరు తాగినా ఇలాంటి శిక్షలు తప్పవనే హెచ్చరికలు చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడుతుండడంతో వాహనదారుల్లో వణుకు మొదలైంది. తాగినప్పుడు వాహనం నడపకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా విందులో మ ద్యం సేవిస్తే వాహనం నడపడానికి కొందరు ఎవరో ఒకరు తాగని వాళ్లను తమ వెంట తెచ్చుకుంటున్నారు.
ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసు లు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే పట్టణానికి నలువైపులా తనిఖీలు సాగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎవరినీ వదలడం లేదు. వాహనాల తనిఖీలు చేస్తున్న సందర్భంలో పో లీసులకు అనుమానం వస్తే చాలు బ్రీథ్ అనలైజర్ ద్వారా టెస్ట్లు చేస్తున్నారు. టెస్ట్లో ఆల్కహాల్ ఎంత పర్సంటేజీ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కువ మోతాదులో తాగినట్టు తేలితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాగి నడపొద్దని కౌన్సెలింగ్ ఇస్తూనే మరోవైపు రిమాండుకు పంపుతున్నారు.
తాగి నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమో, వికలాంగులై జీవితాంతం బాధపడే పరిస్థితులు చూస్తున్నాం. కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండండి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దే శంతోనే జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ శాఖకు సహకరించాలి.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ

తాగి నడిపితే జైలుకు!