
డాక్టరేట్ ప్రదానం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామానికి చెందిన ఉద్యమారి నాగలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ కుమార్, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ చేతుల మీదుగా నాగలక్ష్మి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. హిస్టరీ విభాగంలో సీ్త్ర సాధికారతపై బౌద్ధ దృక్పధం అనే అంశంపై నాగలక్ష్మి రీసెర్స్ చేశారు. నాగలక్ష్మి ప్రస్తుతం పురాతత్వ శాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు.
బీర్కూర్కు చెందిన ఉపాధ్యాయుడికి..
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ అప్రోజ్ అనే ఉపాధ్యాయుడు బుధవారం హై దరాబాద్లో ప్రొఫెసర్ షీలా మిశ్రా చేతుల మీదు గా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సమకాలీన హిందీ చలనచిత్రాల్లో వృద్ధుల ప్రతిబింబం అనే అంశంపై ఆయన విశేష పరిశోధన చేసి పీహెచ్డీ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాల హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షీలా మిశ్రా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ఇస్రో చైర్మన్ నారాయణన్ల చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా అప్రోజ్ మాట్లాడుతూ..తన విజయం వెనుక గురువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారని..వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జప్తిజాన్కంపల్లిలో బుధవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగామాత ఆలయ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామశివారులోని ఊరచెరువు వద్ద గల గంగామాత ఆలయం పురోహితుడు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిపై
పోక్సో కేసు నమోదు
బాన్సువాడ రూరల్: మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలను బ్యాడ్టచ్ చేస్తూ వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కొన్నిరోజులుగా శారీరకంగా వేధిస్తుండంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి స్రవంతి, బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావులు బుధవారం పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు విద్యార్థినుల తో అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి పోలీసు లు, ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో బాన్సువాడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ఈ పాఠశాలలో జరిగిన కంప్యూటర్ల చోరీలోనూ సదరు ఉపాధ్యాయుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
ఒకరి మృతికి కారణమైన
నిందితుడికి 9 నెలల జైలు
కామారెడ్డి క్రైం: నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి కామారెడ్డి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూర్కు చెందిన జమ్మగౌని పోట్ల ముత్తాగౌడ్ తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా బోయిని స్వామి అనే వ్యక్తి తన ఆటోను అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ముత్తా గౌడ్ మరుసటి రోజు హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ స్వామిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన ప్రత్యేక మొబైల్ కోర్టు 2024 ఏప్రిల్ 4 న నిందితుడికి 9 నెలల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అనంతరం నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. బుధవారం కేసును పరిశీలించిన జిల్లా జడ్జి వరప్రసాద్ గతేడాది ప్రత్యేక మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని భావిస్తూ తీర్పునిచ్చారు. కేసును సరైన పద్ధతిలో విచారణ చేసి పకడ్బందీ ఆధారాలతో కోర్టులో అభియోగపత్రం వేసి నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన ఎస్సై రాజు, పోలీసుఅధికారులను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు.