
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు వచ్చాయి. భూ సంబంధిత రెవెన్యూ ఫిర్యాదులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారునికి తెలియపర్చాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.