
బియ్యం మింగిన మిల్లర్లు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీఎంఆర్కు సంబంధించి బియ్యాన్ని మింగిన మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పెండింగ్ బకాయిల రికవరీ కోసం కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ అధికారులతో రివ్యూ చేస్తూ రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నోటీసులు, ఆదేశాలంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరా చేసుకుని బియ్యం మింగిన మిల్లర్లు నోటీసులను పెద్దగా లెక్కచేయడం లేదు. పైగా ఆ ఏమవుతుందిలే.. కేసులు పెడితే చూద్దామనే ధోరణితో కనిపిస్తున్నారు. కాగా చిన్న చిన్న కారణాలతో రేషన్ డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసే అధికారులు రూ.కోట్ల విలువైన బియ్యాన్ని మింగేసిన మిల్లర్లను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బియ్యం విలువ రూ.104 కోట్లు
సీఎంఆర్కు సంబంధించి బకాయిపడిన బియ్యం విలువ రూ.104 కోట్ల మేర ఉంటుందని అధికారులు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడిగా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా సొంతానికి వాడుకోవడం అంటే దుర్వినియోగం చేసినట్టే. మిల్లర్లకు రాజకీయ అండదండలు కూడా ఉండడంతో అధికారులు ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయకపోవడం అంటే ప్రభుత్వానికి నష్టం చేసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు పెండింగ్ బకాయల రికవరీ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
బకాయిపడిన బియ్యానికి సంబంధించి డబ్బులు చెల్లించాలని బియ్యం బొక్కేసిన మిల్లర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని ఆయా తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. అలాగే ఆయా మిల్లుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని, ఆస్తుల మార్పిడి జరగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చి చేతులుదులుపుకున్నారు. సీఎంఆర్కు సంబంధించిన బియ్యం ఇవ్వకుండా వాడేసుకున్న మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అధికారులకే తెలియాలి.
ఏళ్లు గడుస్తున్నా బియ్యాన్ని గానీ, బియ్యానికి సరిపడా డబ్బులు కానీ రికవరీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలను రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆ మూడు సీజన్లలో..
జిల్లాలో 2021–22 ఖరీఫ్ సీజన్లో 39 మిల్లులు 10,406 మెట్రిక్ టన్నులు, 2021–22 యాసంగిలో రెండు మిల్లులు 562 మెట్రిక్ టన్నులు, 2022–23 ఖరీఫ్ సీజన్లో 37 మిల్లులు 23,014 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయపడ్డారు. మొత్తంగా 78 మిల్లుల నుంచి 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రికవరీ చేయాల్సి ఉండగా, కేవలం 19 మిల్లుల నుంచి 13 వేల మెట్రిక్ టన్నులు రికవరీ చేశారు. ఇంకా 59 మిల్లుల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రికవరీ చేయాల్సి ఉంది. బకాయిపడిన మిల్లర్లకు ఫైన్ కింద 25 శాతం అదనంగా అంటే 125 శాతం ఇవ్వాలని నిబంధనల ప్రకారం అంటే 28 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా బియ్యం విలువ రూ.74.97 కోట్లు ఉందని, 25 శాతం అదనంగా అంటే రూ.104.27 కోట్లు బకాయ పడినట్టు స్పష్టమవుతోంది.
నోటీసులతో కాలయాపన..
రికవరీ చేయడంలో
అధికారుల మీనమేషాలు
మూడు సీజన్లలో కలిపి
34 వేల మెట్రిక్ టన్నులు..
రికవరీ చేసింది 13,365
ఎంటీలు మాత్రమే..
ఇంకా 20 వేల
మెట్రిక్ టన్నుల బకాయి