
అక్కాపూర్లో కబ్జా భూమి స్వాధీనం
మాచారెడ్డి: మండలంలోని అక్కాపూర్లో స్థానికులు సాగు చేస్తున్న ఫారెస్ట్ భూమిని గురువారం అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్ పరిధిలోని అధికారులతో పాటు మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ సిబ్బందితో వెళ్లి జేసీబీలు, ట్రాక్టర్లతో పొలం మడులను చదును చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య మాట్లాడుతూ..రైతులు సాగు చేస్తున్న భూమి మొత్తం అటవీ భూమేనని అన్నారు. గతంలో కూడా నాటిన మొక్కలను ధ్వంసం చేశామని, అప్పుడు కూడా రైతులపై కేసులు పెట్టామన్నారు. అక్కడ సాగు చేస్తున్న రైతులకు నోటీసులు జారీ చేసిన తర్వాతనే అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 40 ఏళ్లుగా ఆ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అధికారులు తమపై అనవసరంగా దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులు కామారెడ్డి డీఎఫ్వో నిఖితకు తమ భూములను అప్పగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎఫ్డీవో రామకృష్ణ, కామారెడ్డి ఎఫ్ఆర్వో రమేశ్, సిబ్బంది ఉన్నారు.