
ఎనిమిది పదుల వయసులోనూ..
కామారెడ్డి అర్బన్ : జిల్లా కేంద్రానికి చెందిన గరిపల్లి అంజయ్య గుప్తా వయసు 84 ఏళ్లు. ఆయన ఈ వయసులోనూ నిత్యం యోగా సాధన చేస్తున్నారు. ఆర్యసమాజం స్ఫూర్తితో హైదరాబాద్లోని గాంధీ జ్ఞాన మందిరంలో 1980 ప్రాంతంలో యోగాసనాలు నేర్చుకున్నారు. అప్పటినుంచి యోగా సేవలో తరిస్తున్నారు. ఆధునిక కాలంలో కామారెడ్డి పట్టణంలో తొలి యోగా గురువుగా గుర్తింపు పొందారు. కుటుంబ సభ్యులు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నా అంజయ్య మాత్రం యోగా కోసమే కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. ఆయన రోజు తెల్లవారుజామున గాయత్రి యజ్ఞం, యోగాసనాలు నిర్వహిస్తారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళల కోసం మూడు, పురుషుల కోసం ఆరు యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక యోగా పురస్కారాలను అందుకున్నారు. స్వామి రాందేవ్ బాబా ప్రబోధం మేరకు తాను యోగా వ్యాప్తికి కృషి చేస్తున్నానని అంజయ్య గుప్తా పేర్కొన్నారు. తన వద్ద యోగా నేర్చుకున్న వేలాది మంది ఇతరులకు గురువులుగా మారారంటూ సంతోషం వ్యక్తం చేశారు.