
యోగానే ఇంటి పేరయ్యింది
కామారెడ్డి అర్బన్: ఆయన పేరు రాంరెడ్డి.. ఇంటి పేరు గడ్డం. కానీ పాతికేళ్లుగా యోగాకు అందిస్తున్న సేవలతో ఆయన ఇంటి పేరు మారిపోయింది. అందరూ యోగా రాంరెడ్డి అనే పిలుస్తున్నారు.
గడ్డం రాంరెడ్డి 2001లో కామారెడ్డి ఆర్యసమాజంలో గురువులు అంతిరెడ్డి, బ్రహ్మరాజ్, అంజయ్యగుప్తాల వద్ద ఏడాది పాటు యోగాలో శిక్షణ పొందారు. 2009లో కామారెడ్డి అశోక్నగర్లోని ఎస్ఎస్వై సెంటర్లో 14 మందితో ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 32 ఉచిత యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో కామారెడ్డి పట్టణంలో అర ఎకరం స్థలంలో యోగా భవన్ను నిర్మింపజేశారు. రాంరెడ్డి జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, భారత స్వాభిమాన్ ట్రస్టులకు అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీలు, మట్టి సాన్నాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2021 తర్వాత యజ్ఞ సహిత యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లా యోగా భవన్లో రోజూ తెల్లవారుజామున యజ్ఞసహిత యోగా శుక్రవారం నాటికి 1,411 వ రోజుకు చేరిందని రాంరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కృషితో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించిన తర్వాత యోగాపై ప్రజలలో అవగామన పెరిగిందని పేర్కొంటున్నారు. యోగా అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. నిత్యం యోగా సాధన చేయాలని సూచిస్తున్నారు.