
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కామారెడ్డి క్రైం : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎంపీ సురేశ్ షెట్కార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ‘దిశ’ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ సురేశ్ షెట్కార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మెంబర్ సెక్రెటరీగా పాల్గొన్నారు. 22 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరఫున యువతకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులు, వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ సహాయక సంచాలక భవనం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్కారు బడుల్లో మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 22 లక్షలుగా ఉన్న పని దినాలను 50 లక్షలకు పెంచాలని తీర్మానించారు. ప్రధాన మంత్రి కృషి సంచార్ యోజన కింద జిల్లాను చేర్చాలని, వాటర్ షెడ్ పథకానికి జిల్లాను అనుసంధానం చేయాలని తీర్మానిస్తూ ప్రతిపాదనలు పంపాలన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అధికారులను ఆదేశించారు. పిట్లం మండలంలో కిలోమీటర్ మేర రోడ్డు మరమ్మతులకుగాను అటవీ శాఖ అనుమతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఫారెస్ట్ డీఎఫ్వో నిఖితకు సూచించారు. పోచారం అభయారణ్యం వద్ద రహదారికి 1.5 కిలోమీటరు మేర అటవీ అనుమతులు తీసుకోవాలని తీర్మానించారు. నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నందున దారి వెంబడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. నోటీసులు పంపి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. శివానగర్ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మొరం లభ్యతకు ఇబ్బందు లేకుండా చూడాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో తీర్మానించిన అంశాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, దిశ కమిటీ సభ్యులు కవిత, నగేష్, జాదవ్ నౌషా, దేశముఖ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపీ సురేశ్ షెట్కార్, వేదికపై ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సమావేశంలో పాల్గొన్న సభ్యులు, అధికారులు
వాణిజ్య పంటలపై రైతులకు
అవగాహన కల్పించాలి
దిశ సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కార్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి