
చదువులో రాణించాలి
● బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర
కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్
కామారెడ్డి క్రైం: చదువులో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉన్న బాలసదనం, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లను గురువారం ఆమె సందర్శించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగకుండా చూడాలన్నారు. అనంతరం ఆమె కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ స్వర్ణలత, డీసీపీవో స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చిన మాట తప్పను
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
భిక్కనూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం తప్ప.. మాట తప్పే వ్యక్తిని కానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, లక్ష్మీదేవినిపల్లి, కాచాపూర్ గ్రామాలలో పలు కుల సంఘాల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కుల సంఘాల వద్ద తన సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించానన్నారు. అన్ని కుల సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండి సంఘాలను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్, నాయకులు, కార్యకర్తలు ఆయా కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
యోగా చేయండి
ఆరోగ్యంగా ఉండండి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ : ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా టీచర్ ఓట్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, శారీరక, మానసిన ఆరోగ్యానికి యోగా చాల ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 21న అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్న యోగా దినోత్సవానికి అందరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, డీఎల్పీవో సత్యనారాయణ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ కళాశాలలో
ప్రవేశాలకు బారులు
కామారెడ్డి అర్బన్: డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రక్రియ గురువారం చివరి రోజు కావడంతో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు బారుల తీరారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విన్నూత కోర్సులుండగా ప్రవేశాల కోసం విద్యార్థులు బారులు తీరారు. తొలి ప్రాధాన్యతగా తమ కళాశాలను ఎంపిక చేసుకోవడంపై ప్రిన్సిపల్ విజయ్కుమార్ హర్షం వ్యక్తంచేశారు.
‘దోస్త్’ గడువు పొడిగింపు..
డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కే విజయ్కుమార్ తెలిపారు. దోస్త్లో ఎంపికలు ఇవ్వని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదువులో రాణించాలి

చదువులో రాణించాలి

చదువులో రాణించాలి