
యూరియా కోసం పడిగాపులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): యూరియా ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మృగశిరకార్తెకు ముందే పెద్ద వర్షాలు కురవడంతో రైతులు మొక్కజొన్న, పత్తి, సోయా విత్తనాలు వేశారు. విత్తనాలు మొలకెత్తడంతో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తాడ్వాయి సింగిల్విండోకు యూరియా వచ్చిందని తెలియడంతో గురువారం ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదాము వద్ద రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను క్యూలో ఉంచారు. అలాగే రైతు వేదిక కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్నారు. రైతులందరికీ సరిపడా బస్తాలు వచ్చిన తరువాతే ఇస్తామని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మరో లారీ వచ్చినట్లు తెలియడంతో రాత్రి వేళ మళ్లీ తరలివచ్చారు. దుప్పట్లు వెంట తీసుకువచ్చి సింగిల్ విండో ఎదుటే పలువురు రైతులు పడుకున్నారు. సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు డిమాండ్ చేశారు.

యూరియా కోసం పడిగాపులు