వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

Jun 20 2025 6:03 AM | Updated on Jun 20 2025 6:03 AM

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి క్రైం: జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌– 2025పై జిల్లాస్థాయి అవగాహనా సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలలో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, మురికి కాలువలు శుభ్రం చేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రైడే నిర్వహించాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్‌ చేయాలని, తాగునీటి పైప్‌లైన్‌లకు లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలన్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హైరిస్క్‌ ప్రాంతాలైన కామారెడ్డి అర్బన్‌, దేవునిపల్లి, రామారెడ్డి మండలం అన్నారంతోపాటు లింగంపేట్‌, మాచారెడ్డి, నిజాంసాగర్‌ ప్రాంతాల్లో ముందస్తుగా డెంగీ నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ నివారణపై జిల్లా, పీహెచ్‌సీ స్థాయిల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను నియమించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధిహామీ..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా చేయించాలని, క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. గరిష్టంగా కూలీ వచ్చేలా ఉపాధిహామీ పనులు కల్పించాలని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు సంబంధించి బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలో ఒక సామాజిక మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ నిర్మించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో మంజూరు చేయాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు రెండో విడత యూనిఫామ్‌ల తయారీని ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 3 పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్‌ చందర్‌, డీఆర్డీవో సురేందర్‌, డీపీవో మురళి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement