
సన్నబియ్యం పంపిణీలో టాప్
కామారెడ్డి క్రైం: సన్నబియ్యం పంపిణీలో జిల్లా ప్రథమ స్ధానంలో నిలిచింది. వేగవంతంగా వందశాతం బియ్యం పంపిణీ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేపట్టారు. దుకాణాలకు కార్డుదారులు ఒక్కసారిగా రావడం, కనీసం మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవడం, సాంకేతిక సమస్యలు వంటివి మొదట్లో ఇబ్బందులకు గురిచేశాయి. అయినప్పటికీ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో పంపిణీ ప్రక్రియ ముందుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
17,505 మెట్రిక్ టన్నులు..
జిల్లాలో 578 రేషన్ దుకాణాలు, వాటి పరిధిలో ప్రతి నెలా 5,835 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఉంటుంది. కానీ నెలలో మాత్రం మూడు నెలలకు సంబంధించి 17,505 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒకే సారి కేటాయించారు. గత నెలాఖరు నుంచే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సకాలంలో రేషన్ దుకాణాలకు చేరేలా పివిల్ సప్లయ్ అధికారులు చర్యలు చేపట్టారు.
19 రోజుల్లోనే..
ఈ నెల ప్రారంభంలోనే రేషన్ పంపిణీ మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం.. సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు తరలివచ్చారు. దీంతో దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎక్కువసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి ఉండటంతో ఒక్కో లబ్దిదారుడికి బియ్యం పంపిణీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. కొందరు డీలర్లు మొదట్లో ఒక్కోరోజు రాత్రి 11 గంటల వరకు బియ్యం పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా 19 రోజుల్లోనే రేషన్ డీలర్లు, అధికారులు కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు.
వందశాతం పంపిణీ పూర్తయిన
జిల్లాగా కామారెడ్డి
వేగవంతంగా పూర్తయిన ప్రక్రియ
పంపిణీ పూర్తయ్యింది
జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తయ్యింది. ఈ నెల 19 నాటికి లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించాం. దీంతో పంపిణీ ప్రక్రియ త్వరగా చేపట్టడంలో మన జిల్లానే ముందుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
– రాజేందర్, డీఎం, సివిల్ సప్లయీస్
కార్పొరేషన్, కామారెడ్డి