● టీటీడీ వేద పండితులు శ్రీపాద, గుళ్లపల్లి
● ఘనంగా వీరభద్ర వేదశాస్త్ర విద్వత్ సభ
కొత్తపేట: పూర్వజన్మ సుకృతం వల్లే ఈ పుణ్యభూమిలో జన్మించామని టీటీడీ మాజీ పరీక్ష అధికారి బ్రహ్మశ్రీ శ్రీపాద మాణిక్య అవధానులు, గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి అన్నారు. వీరభద్ర వేదశాస్త్ర విద్వత్సభ 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక హరిహర దేవాలయ ప్రాంగణంలో వేదసభ నిర్వహించారు. సభకు గుళ్లపల్లి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేద పఠనంలో భాగంగా సంహిత క్రమ అధ్యాయాలు, వేదాల ప్రాముఖ్యతను, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరించారు. అన్ని ధర్మాలకు సనాతన ధర్మమే మూలమని, వేదం చెప్పినట్టు నడుచుకోవాలని, ముఖ్యంగా పిల్లలను సనాతన ధర్మం వైపు నడిపించాలని తల్లిదండ్రులకు సూచించారు. మాణిక్యావధాని పర్యవేక్షణలో సభ నిర్విరామంగా జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 70 మంది ఘనపాఠిలు పాల్గొని వేదాలు వల్లించారు. అనేక గ్రామాల నుంచి వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం మాణిక్య అవధానులు, దత్తాత్రేయ ఘనాపాఠి తదితరులను వేదసభ నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు కాకరపర్తి బంగారుబాబు, పట్టమట్ట రామకృష్ణ రవిప్రసాద్, చిలుకూరి రామశేషగిరిరావు, తనికెళ్ల వెంకట రామారావు, అజ్జరపు వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


