కర్నూలు (హాస్పిటల్): ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి ఎన్నికయ్యారు. ఏఓఐ ఏపీ కాన్–2026 పేరుతో మూడు రోజులుగా కర్నూలులో నిర్వహిస్తున్న 44వ ఈఎన్టీ వైద్యుల రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ ఆదివారం ముగిసింది. ముందుగా సంఘ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్లు. గత రెండేళ్లుగా అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ బి.జయప్రకాష్రెడ్డి (కర్నూలు)ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ పి.హరికృష్ణ, కర్నూలు అధ్యక్షుడు డాక్టర్ ఎం.మహేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈఎన్టీ వైద్యుల రాష్ట్ర కాన్ఫరెన్స్లో భాగంగా మూడోరోజు సీఎస్ఎఫ్ రైనోరియా సమగ్ర నిర్వహణ, మధ్య చెవిలో ఏర్పడే అసాధారణ చర్మపు పెరుగుదలను తొలగించే శస్త్రచికిత్సలపై శిక్షణ ఇచ్చారు.


