ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలోని పార్కింగ్ ఏరియాలో మోటార్ సైకిళ్లు దొంగిలిస్తున్న నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై ఎస్.రాము తన సిబ్బందితో లొల్ల కొత్త వంతెన వద్ద సోమవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామ అడ్డపుంతకు చెందిన అంబటి సత్యనారాయణ (49) రావులపాలెం వైపు నుంచి వేగంగా వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని ఎస్సై రాము తమ సిబ్బందితో పట్టుకుని విచారించి, అతని నుంచి 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి, కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఎస్సై వివరించారు.


