ఉప్పాడ పీతలకు గిరాకీ పెరిగింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల్లో పరుగులు పెడుతోంది. కొత్తపల్లి మండలం అమీనాబాద్ తీర ప్రాంతంలోని మత్స్యకార వ్యాపారులు పీతల వ్యాపారంతో బిజీబిజీ అయ్యారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారానికి 4 నుంచి 5 టన్నుల వరకూ ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పీతలు రూ.200 నుంచి 250 వరకూ విక్రయిస్తున్నారు. వీటి విలువ ఇతర రాష్ట్రాల్లో రూ. 5 వందల నుంచి రూ.8 వందలు ఉంటోంది.
ఉడకబెట్టి.. ప్యాక్ చేసి
మత్స్యకారుల వలలకు చిక్కిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని పెద్ద పాత్రల్లో ఉడకబెడుతున్నారు. ఇలా ఉడకబెట్టిన పీతలను చల్లారిన తరువాత వాటిని శుభ్రపరిచి, పెంకు తీసి కవర్లలో వేసి ఐస్ పెట్టెల్లో పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తాజాగా ఉంచడం కోసమే పీతలను ఉడకబెడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. – కొత్తపల్లి


