గోకవరం: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంపచోడవరం పర్యటన సందర్భంగా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో రాత్రి వరకు విద్యార్థులను ఉంచిన మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ డిమాండ్ చేశారు. స్థానిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ పర్యటనలో అత్యుత్సాహం ప్రదర్శించి, కృష్ణునిపాలెంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాత్రి 9 గంటల వరకు ఉంచడం హేయమైన చర్యన్నారు. విద్యాశాఖ అధికారులు చిన్నపిల్లలను ఇబ్బంది పెడుతూ, చీకట్లో ఉంచడం బాధాకరమని, ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలతో బయటకు పంపించమంటే జీఓలు ఉన్నాయని, అలా కుదరదని చెప్పే విద్యాశాఖ అధికారులు ఇప్పుడు పిల్లలను చీకట్లో, దోమల్లో ఎలా ఉంచుతారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ సంఘటనపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


