కాట్రేనికోన: ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి వర ప్రసాదరావుతో కలిసి శనివారం ఆయన గచ్చకాయలపోర సముద్ర తీరంలో ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణ ఇంక్యుబేషన్ కేంద్రంలో గుడ్ల నుంచి విడుదలైన 300 పిల్లలను సముద్ర జలాల్లో వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాబేళ్లు పెట్టిన గుడ్లును కృత్రిమంగా ఇంక్యు బేషన్ కేంద్రంలో సుమారు రెండు అడుగుల గోతుల్లో 45 రోజులు భద్రంగా రక్షించడంతో పిల్లలు విడుదలవుతున్నాయన్నారు. సుమారు 50 వేల గుడ్లు ఇంక్యుబేషన్ కేంద్రాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రవికిరణ్, అటవీశాఖ అధికారులు ఉన్నారు.
ప్రాధాన్యతా రంగాలకే సరఫరా
అమలాపురం రూరల్: ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, ఇతర రంగాలకు మల్లింపును నిలుపుదల చేయాలని డీలర్లను కలెక్టర్ మహేష్ ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని 25 గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, పెద్ద క్యాటరింగ్ సంస్థల్లో రోజు వారీ తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లయితే స్వాధీనం చేసుకుని 6ఎ కేసులు నమోదు చేయాలన్నారు.


