
పంచారామ క్షేత్రంలో రేపు వేద పరిషత్
సామర్లకోట: ఏటా నిర్వహిస్తున్న వేద పరిషత్ను మంగళవారం పంచారామ క్షేత్రం శ్రీబాలా త్రిపుర సుందరి సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని వేదపండితులచే 27వ వేద సభ నిర్వహించి వేదపండితులను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం హిందూ సంస్కృతి, సంప్రదాయానుసారంగా చతుర్వేద పారాయణ, వేద స్వస్తి జరుగుతుందని చెప్పారు.
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో ఆదివారం నాటికి స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉండడంతో నీటిప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 646 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం నుంచి 1225 క్కూసెక్కుల నీరు చేరడంతో ప్రాజెక్టులో స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 78.49 మీటర్లు, 24.11 టీఎంసీలకు 11.77 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టు 400, విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
లోవకు భక్తుల తాకిడి
– రూ.4.33 లక్షల ఆదాయం
తుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో వంటలు, భోజనాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. టార్పాలిన్ను కట్టుకుని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,43,280, పూజా టికెట్లకు రూ.1,27,400, కేశఖండనశాలకు రూ.12,800, వాహన పూజలకు రూ.4350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.96,216, విరాళాలు రూ.49,117 వెరసి మొత్తం రూ.4,33,163 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు.

పంచారామ క్షేత్రంలో రేపు వేద పరిషత్

పంచారామ క్షేత్రంలో రేపు వేద పరిషత్