గద్వాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన పత్రాలు అందజేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆయా రోజుల్లో బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సేవలను అందించాలన్నారు. ఓటరు జాబితాలో పేరులేని అర్హులైన పౌరులు ఫారం–6 ద్వారా కొత్తగా తమ పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో ఏదైనా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదా అనర్హులైన ఓటరు పేరు తొలగించేందుకు ఫారం–7 ద్వారా, ఓటరు వివరాల్లో తప్పులు సరిచేయడం, చిరునామా మార్పుల కోసం ఫారం–8ను సమర్పించవచ్చన్నారు. సర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఏ, బీ, సీ కేటగిరిలో ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలను సమర్చించాలన్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,49,282 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 36 వేల మందికి ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మంజుల, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


