భూపాలపల్లి అర్బన్: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆది వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం సింగరేణి హైస్కూల్లో రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజులపాటు ఉచితంగా క్లాసులతోపాటు గ్రౌండ్ కోచింగ్ అందిస్తామని అదనపు ఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు కష్టపడి చదవడంతోపాటు శారీరకంగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు రత్నం, సంతోష్కుమార్, కాశీరాం, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


