● కలెక్టర్ రాహుల్శర్మ
గణపురం: పొరపాట్లకు తావులేకుండా భూ రీ సర్వేను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామ పంచాయతీ శివారు తూపురం వద్ద జరుగుతున్న భూ రీ సర్వేను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 12 గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో రీ సర్వే చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ల భద్రతకు అవసరమైన గమ్ షూస్, ఇతర రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. రోవర్ తదితర ఇతర పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ సర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గణపురం మండలంలో ఆరు గ్రామాలను రీ సర్వే కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ రాజేశ్వర్రావు, రైతులు పాల్గొన్నారు.


