భూపాలపల్లి: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ‘బీ సైబర్ స్మార్ట్’ అవగాహన పోస్టర్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, కోడ్లు, ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు సైబర్ భద్రతకు కూడా ప్రతీ ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్సై శ్రీనివాస్, ఆర్ఎస్ఐ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
జిల్లాలోని పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 6న ఉదయం 7 గంటలకు ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శారీరక, రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత డే స్కాలర్ తరగతులతో పాటు గ్రౌండ్ కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు.
ఎస్పీ సంకీర్త్


