రోడ్ల పక్కనే
వెంగల్రావు వెంచర్లో
పిచ్చిమొక్కలతో నిండిన సైడ్ కాలువలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణ నిర్వహణ అధ్యానంగా మారింది. పట్టణంతో పాటు వీలిన గ్రామాల్లో ఏ మూలన చూసినా చెత్తకుప్పులు కుప్పులుగా పేరుకుపోయి కనిపిస్తోంది. పలు కాలనీల్లో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు ఇళ్ల ముందు నుంచే పారుకుంటూపోతుంది. పట్టణంలో ప్రతీ మూడు రోజులకు ఒక సారి చెత్త సేకరణ చేయడం వలన ప్రజలు ఇళ్లలోని చెత్తను తీసుకెళ్లి కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా పడేసిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించడం లేదు. వర్షాకాలం కావడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడంతో పాటు ఈగలు దోమలు వృద్ధి చెందుతున్నాయి.
సీజనల్ వ్యాధులు భారినపడుతున్న ప్రజలు
మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యలోపంలో దోమలు వృద్ధి చెందడం, వాతావరణ మార్పు వలన పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడుతున్నారు. పట్టణంలోని 30 వార్డుల్లో సుమారు 70వేల జనాభా ఉన్నారు. దినదినం విస్తరిస్తున్న పట్టణానికి తగిన పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో కేవలం 66 మంది మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కాలనీలో ప్రతీ మూడు రోజులకు ఒక సారి చెత్తను సేకరించడం వలన మూడు రోజుల పాటు చెత్తను నిల్వ చేసుకోలేక కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురికి కాలవల్లో చెత్తను పడేస్తున్నారు. ఫాగింగ్ కూడా అంతంత మాత్రమే నిర్వహిస్తున్నారు. అరకొర యంత్రాలతో కాలం సాగదీస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఒకటి, రెండు సార్లు మాత్రమే కాలనీల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. రెండు నెలల్లో పట్టణంలో 8 డెంగీ, 7 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కంపుకొడుతున్న భూపాలపల్లి పట్టణం
కాలనీల శివారుల్లో దుర్వాసన
ముదురుతున్న సీజనల్ వ్యాధులు
పట్టించుకోని మున్సిపల్ శాఖ
పట్టణ ప్రజలకు అవగాహన కరువు


