● ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆయన.. సెప్టెంబర్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టులో ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం ఉండగా 1.60 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. లక్ష్యంలో 43 శాతం సాధించి రవాణా చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా నమోదైందన్నారు. సెప్టెంబర్ నెలకు 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గిస్తే ఉత్పత్తిని మరింత పెంచవచ్చన్నారు.
ఆరోగ్యం, ఉల్లాసానికి క్రీడలు దోహదం
పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో సింగరేణి కార్మికులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, శ్యాంసుందర్, నాయకులు మోటపలుకుల రమేశ్, హుస్సేన్, సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ పాల్గొన్నారు.


