● నల్లబ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వెంటనే అమలు చేయాలని టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్, సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగు రవికుమార్ మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1నుంచి నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట సీపీఎస్ విధానం శాపంగా మారిందన్నారు. సీపీఎస్ కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, వారి భవిష్యత్ అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీపీఎస్ను రద్దుచేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎ.దశరథరామారావు, నాయకులు షఫీ అహ్మద్, శ్రీనివాసరావు, రాజ్కుమార్, తిరుపతి, అజహర్, శ్రీనివాస్, శ్రీదేవి పాల్గొన్నారు.


