భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని డీఆర్ఓ వసంతకుమారి ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 62 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందిస్తూ, వినతులు పరిష్కరించాలన్నారు. అనంతరం భూపాలపల్లి ఆర్డీఓగా విధులు నిర్వర్తించి, ప్రస్తుతం వికారాబాద్ డీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన మంగీలాల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భూపాలపల్లి రూరల్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు శిలపాక హరీశ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే అమలుచేయాలని గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేశ్, జోగుల సమ్మయ్య, సమ్మయ్య, నద్దునూరి రాజ్ కుమార్, పర్లపల్లి వంశీకృష్ణ, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిలుముల శేషుకుమార్, చిలుముల కృష్ణ, బొడ్డుపాల్, చరణ్ పాల్గొన్నారు.
డీఆర్ఓ వసంతకుమారి


