భూపాలపల్లి: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ 13 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధానంలో ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యతని తెలిపారు.
పదవీ విరమణ సహజం
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో ఎస్సైలు ఎస్.ఈశ్వరయ్య, ఎన్.సత్యనారాయణరావు, ఏఆర్ ఎస్సై పి.రవికుమార్, ఏఎస్సై సీహెచ్.కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ పి.అశోక్లను ఎస్పీ సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, పోలీసు సంఘం అధ్యక్షుడు నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


