భూపాలపల్లి: పారదర్శకమైన తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (సర్) ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ‘సర్’ ప్రక్రియపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలిస్ ఓటర్లుకు నోటీసులు జారీపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్నారు. జిల్లాలో 11,739 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 20,685 మంది అనామలీస్ ఓటర్లు మొత్తం 32,424 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓల ద్వారా నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేసిన ఓటర్లు నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరై ఎన్నికల సంఘం ఆదేశాల ధృవీకరణ ఆధారాలను సమర్పించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


