భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం, ఒలింపిక్ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ నవీన్రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
నెమలి అప్పగింత
చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామంలో శుక్రవారం నెమలి సంచరించగా.. గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రత్న జ్యోతి గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెమలిని హనుమకొండలోని జంతు ప్రదర్శన శాలకు తరలించినట్లు ఆమె తెలిపారు. కాగా గ్రామస్తులు బాధ్యతగా వ్యవహరించి జనారణ్యంలో నుంచి వచ్చిన నెమలిని రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించడంపై వారిని అభినందించారు.
కేయూలో
ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటాయన్నారు. టీఎస్ఐసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావొచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఫీజు తీసుకురావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్ అధికారిక వెబ్సైట్తోపాటు యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల నోటీస్ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్ నర్సింహాచారి వివరించారు.
స్కూల్ ఆఫ్ లెర్నింగ్లోనూ..
కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యాకేంద్రంలోని స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (కేయూ ఎస్ఎల్)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేష్లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్–2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమతమ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.
నిట్లో
తెలుగు భాషాదినోత్సవం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ.. నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.


